ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్: గాంధీ భవన్‌లో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కోసం అందరం కలిసి పోరాటం చేశామని తెలిపారు. వచ్చిన తెలంగాణలో పోరాట లక్ష్యాలు నెరవేరలేదన్నారు. తెలంగాణలో నిరసన కార్యక్రమాలు చేసే హక్కు లేదని చెప్పారు. ఒక నియంత పాలన సాగుతోందని విమర్శించారు. విద్య, ఉద్యోగ రంగాలలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కనీసం ప్రభుత్వ శాఖలలో ఖాళీలు కూడా పూర్తి చేయడం లేదని వ్యాఖ్యానించారు. డీఎస్సీ, టీపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు.

పాలకుల నిర్లక్ష, నియంత పోకడలపై కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు విద్యార్థి, నిరుద్యోగ అంశాలలో పోరాటం చేస్తున్నామని, అంత కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘‘అసెంబ్లీలో పోరాటం చేస్తున్నాం..మీ అంశాలు కూడా మాకు తెలియజేస్తే మీ గొంతును కూడా అసెంబ్లీలో వినిపిస్తాం’’ అని సమావేశంలో భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ ఉపాధ్యక్షులు ప్రో. విశ్వేశ్వర రావ్, ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, న్యూ డెమోక్రసీ, టీటీడీపీ, లిబరేషన్ తదితర పార్టీలు పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/