తెలంగాణలో నేడు, రేపు అధికంగా ఉష్ణోగ్రతలు

ఎల్లుండి నుంచి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

హైదరాబాద్ : తెలంగాణలో ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నారు. నేడు, రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాధార‌ణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

ఇక నిన్న‌ ఆదిలాబాద్‌ జిల్లాలోని జైసద్‌లో అత్య‌ధికంగా 45.7 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. అలాగే, జగిత్యాలలోని ఐలాపూర్ లో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఓవైపు ఎండ‌లు మండిపోతుండ‌గా కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ‌ర్షాలు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావ‌ర‌ణ శాఖ‌ అధికారులు పేర్కొన్నారు. ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కూడా ప‌డే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/