మళ్లీ వందేభారత్ రైలుపై దాడి… కిటికీ అద్దాలు ధ్వంసం
తిరువనంతపురంః కేరళలో కొత్తగా ప్రారంభించిన వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. దీంతో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ధృవీకరించారు. కాసర్గాడ్ నుంచి తిరువనంతపురం రైలు వెళ్తుండగా తిరునవయ, తిరూర్ మధ్య గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాగా, కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ రైల్వేస్టేషన్లో ఏప్రిల్ 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వందే భారత్ రైలును ప్రారంభించారు. అయితే ఈ రాళ్ల దాడిలో ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు పేర్కొన్నారు. ఒక కోచ్ పూర్తిగా డ్యామేజ్ అయిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వందే భారత్ రైళ్లతో పాటు మిగతా రైళ్లకు కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.