ఎల్‌కే అద్వానీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

రాజ్ నాథ్ తో కలిసి అద్వానీ ఇంటికి వెళ్లిన మోడీ

pm-modi-birthday-greetings-to-bjp-veteran-leader-lk-advani

న్యూఢిల్లీః బిజెపి సీనియర్ నేత, భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (95)జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నేరుగా అద్వానీ ఇంటికి వెళ్లారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి అద్వానీ ఇంటికి వెళ్లిన మోడీ… బిజెపి కురు వృద్ధుడికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అద్వానీతో కూర్చుని పలు అంశాలపై మోడీ చర్చించారు.

1927 నవంబర్ 8న ఇప్పటి పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించిన అద్వానీ… దేశ విభజన సమయంలో కుటుంబంతో కలిసి భారత్ వచ్చేశారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో ప్రచారక్ గా చేరిన ఆయన ఆ సంస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. తదనంతరం జన సంఘ్ లో చేరిన అద్వానీ… జన సంఘ్ ను బిజెపిగా మార్చడంలో కీలక భూమిక పోషించారు.

1990 దశకంలో దేశ రాజకీయాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేని బిజెపిని… దేశవ్యాప్త రథయాత్రతో ఏకంగా కేంద్రంలో అధికారం చేపట్టే దిశగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత వాజ్ పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా…అద్వానీ ఉప ప్రధాని పదవితో సరిపెట్టుకున్నారు. వాజ్ పేయి ఉన్నంత కాలం క్రియాశీల రాజకీయాల్లోనే ఉన్న అద్వానీ… కొత్త తరం పార్టీ పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా జరిగారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/