రోజా వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ

వైస్సార్సీపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు. నటుడు, టీడీపీ నేత తారకరత్న హాస్పటల్ లో ఉంటె..నారా లోకేష్ లెగ్ వల్లే ఆయన హాస్పటల్ లో ఉన్నారని రోజా కామెంట్స్ చేయడం దారుణమన్నారు. లోకేశ్ పాదయాత్ర పోస్టర్ రిలీజ్ చేస్తే 8 మంది చనిపోయారని, కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభిస్తే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని రోజా వ్యాఖ్యానించారు. లోకేశ్ ఐరన్ లెగ్ సైకో అని, ఇప్పుడు రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారని రోజా కామెంట్స్ చేసారు.

దీనిపై ఎమ్మెల్సీ మంతెన ఆగ్రహం వ్యక్తం చేసారు. డ్యాన్సులు, బూతులు తప్ప మంత్రి రోజాకు ఏం తెలుసని ప్రశ్నించారు. తారకరత్న ఆరోగ్యంపై వైస్సార్సీపీ నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. బాబాయ్ ని చంపినవారికి ఇలాంటి క్షుద్ర రాజకీయాలు కొత్త కాదని అన్నారు. లోకేశ్ పాదయాత్రపై వైస్సార్సీపీ నేతలు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్ర కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. లోకేష్ పాదయాత్ర పూర్తయ్యే లోపు వైస్సార్సీపీ నేతలు వీసా ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు.