ఈ కారణంగానే తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందిః మంత్రి ధర్మాన

సంస్కరణలను అర్థం చేసుకోకపోవడంతోనే ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ధర్మాన

ap-minister-dharmana-prasada-rao-said-negativity-in-public-over-ysrcp-government

అమరావతిః ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యతిరేకతకు కారణం సంస్కరణలను ప్రజలు అర్థం చేసుకోకపోవడమేనని కూడా ఆయన అన్నారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా సంస్కరణలు చేసే వారికి ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంటుందని కూడా ధర్మాన మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సంస్కరణలు చేసేటప్పుడు ఫలితాలు ముందుగా రావని ఆయన అన్నారు. ఈ కారణంగానే సంస్కరణలకు ప్రజల నుంచి ఆమోదం అంత త్వరగా రాదని పేర్కొన్నారు. అయితే ప్రజలకు మేలు జరిగేందుకు ప్రజల్లో తొలుత వ్యతిరేకత వస్తుందని తెలిసినా… సీఎం జగన్ సంస్కరణల బాట పట్టారని ధర్మాన అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/