పాకిస్తాన్‌లో కంటే భారతదేశంలోని ముస్లింలు సంతోషంగా ఉన్నారుః నిర్మలా సీతారామన్

ఇండియాలో ముస్లింలు హింసకు గురవుతున్నారన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన నిర్మల

“Muslims in India are doing better than in Pakistan” Nirmala .

న్యూఢిల్లీః భారత్‌లో ముస్లిం మైనార్టీలు హింసకు గురవుతున్నారంటూ పశ్చిమ దేశాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపడేశారు. ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ లో కంటే ఇండియాలో ఉన్న ముస్లింలే చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉందని అన్నారు. ఇండియాలో ముస్లింల సంఖ్య కూడా పెరుగుతోందని చెప్పారు. భారత ప్రభుత్వం నుంచి ముస్లింలు హింసను ఎదుర్కొంటున్నట్టయితే 1947 నుంచి వారి జనాభా ఇంత స్థాయిలో పెరిగేది కాదని అన్నారు.

పాకిస్థాన్ లో మైనార్టీల పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోందని విమర్శించారు. పాక్ లో మైనార్టీల జనాభా నానాటికీ తగ్గుతోందని అన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా భారత్ పై అసత్య ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. వాషింగ్టన్ లోని పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లో జరిగిన చర్చా వేదికలో ఆమె ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.