నిన్న కుక్కలు , నేడు కోతులు ..తెలంగాణ లో పసి పిల్లల ఫై వరుస దాడులు

తెలంగాణ లో కుక్కలు , కోతుల దాడులు ఎక్కువైపోతున్నాయి. ఒంటరిగా పసి పిల్లలు కనిపిస్తే చాలు వారిపై దాడులకు పాల్పడుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట్ లో నాలుగేళ్ల బాలుడి ఫై మూడు కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ గా మారింది. దీనిపై స్థానికులు , రాజకీయ పార్టీ లు సైతం GHMC ఫై ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఈ దాడి గురించి ఇంకా మాట్లాడుతుండగానే తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెం లో ఓ చిన్నారిపై కోతులు దాడి చేశాయి. పాపను వరండాలోని ఉయ్యాలలో పడుకోబెట్టి నీళ్ల కోసం తల్లి ఇంట్లోకి వెళ్ళింది.

ఈ తరుణంలోనే కోతులు ఒకసారిగా ఆ చిన్నారిపై దాడి చేశాయి. చిన్నారి కాలి బొటనవేలును కొరికాయి. దీంతో వెంటనే తల్లిదండ్రులు మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి ఆ చిన్నారిని తీసుకువెళ్లారు. ఇక అత్యవసర మెరుగైన వైద్యం కోసం వైద్యులు అక్కడి నుంచి వరంగల్ తరలించారు. ఇక ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత కొద్దీ నెలలుగా గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు చెపుతున్నారు. పంటపొలాలను నాశనం చేయడమే కాకుండా ఇళ్లలోకి వచ్చి నానా బీబత్సం చేస్తున్నాయని , మనుషుల ఫై దాడి చేస్తున్నాయని వారంతా చెపుతున్నారు.