అలాంటి వాళ్ళతో ఒరిగేదేమీ లేదు

వరంగల్‌: నల్గొండ – వరంగల్ -ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నేడు మరిపెడ లో టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, పట్టభద్రుల తో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కల్లబొల్లి మాటలకు మోసపోవద్దు, ప్రజలకు ఏమీ చేయని వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళతో ఒరిగేదేమీ లేదని ఏదైనా చేయ గలిగింది ఒక్క సిఎం ‌కెసిఆర్ మాత్రమే. కాబట్టి టిఆర్ఎస్ కే ఓటు వేయాలని, విద్యాధికుడు, విద్యాసంస్థల అధినేత, మన ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ గా భారీ మెజారిటీతో గెలిపించాలని దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.

టిఆర్‌ఎస్ రాక ముందు, వచ్చాక పరిస్థితులు బేరీజు వేసుకుని చూడండి. మీ కళ్ళ ముందే అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తున్నాయి. ప్రతి ఇంటికి సిఎం ‌కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాల్లో ఏదో ఒకటి మీకు అంది ఉంటుంది. మీ అనుభవం లోకి వచ్చి ఉంటుంది. ఇంత కంటే ఎవరైనా ఎక్కువ చేశారా? చేయగలరా? ఆలోచించండి. టిఆర్‌ఎస్ అభ్యర్థికి మీ ఓటు వేసి గెలిపించండి… అంటూ పట్టభద్రుల ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు. ఓట్లు రాగానే కొందరు వస్తుంటారు. పోతూ ఉంటారు. ఇక్కడే ఉండి, మన కోసం ఆలోచించే వాళ్ల కు మాత్రమే మన పట్ల, మన ప్రాంతం పట్ల, ఆర్తి ఉంటుందని అన్నారు. ఈకార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎంపి మాలోత్ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, ఎమ్మెల్య రెడ్యా నాయక్, అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/