రేపటి నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ

రేపటి (ఏప్రిల్ 11) నుండి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డి లు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు బీఆర్‌ఎస్‌ భవన్‌లో కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాలు అధికారులు, డీఎంలు, ఎఫ్‌సీఐ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని కొనుగోళ్లకు సిద్ధం కావాలని ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, ఇందుకు 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. యాసంగికి సీజన్ సీఎంఆర్‌ను 30వ తేదీలోగా మిల్లర్ల నుంచి సేకరించాలని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.