హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రభుత్వం హెచ్చరిక

గ్రేటర్ హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రభుత్వం హెచ్చరిక జారీచేసింది. అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వీధి వ్యాపారులు అంత కూడా ఉచితంగా తాగునీరు ఇవ్వాలని ఆదేశించింది. జలమండలి సరఫరా చేసే తాగు నీటిని గానీ, ఆర్ఓ వాట‌ర్, శుద్ధి చేసిన నీటిని గానీ తప్పని సరిగా ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు.

ఒకవేళ, హోటళ్లు, రెస్టారెంట్లలో తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్ బాటిల్స్ సరఫరా చేస్తే ఆయా బాటిల్స్ పై ముద్రించిన గరిష్ట ధరను మాత్రమే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో పలు బ్రాండ్ల పేరుతో కస్టమర్ల నుండి అత్యధిక ధరకు వాటర్ బాటిల్స్ ను విక్రయిస్తున్నారని ఫిర్యాదు మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ విధంగా స్పందించారు.