లోకేశ్ ను బలోపేతం చేసేందుకే జనసేన పెట్టారా?: అంబటి రాంబాబు

యువగళం సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్న అంబటి

Ambati Rambabu

అమరావతిః నారా లోకేశ్ చేసిన యువగళం పాదయాత్ర ఫ్లాప్ అయిందని… నిన్న జరిగిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అసలు పాదయాత్ర ఎవరి కోసం చేశారో కూడా అర్థం కావడం లేదని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుగానే ప్యాకేజీ మాట్లాడుకుని సభకు వచ్చారని ఆరోపించారు. చంద్రబాబుతో పవన్ ఎప్పుడూ కలిసే ఉన్నారని… చంద్రబాబు ఐదేళ్లు అడ్డగోలు పాలన చేసినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.

ఎన్నోసార్లు చంద్రబాబు, లోకేశ్ లను పవన్ తిట్టారని… ఇప్పుడు అదే నోటితో ప్రశంసిస్తున్నారని విమర్శించారు. జనసేన కార్యకర్తలను పవన్ మోసం చేస్తున్నారని అన్నారు. జనసేన సభకు రానని ముందు చెప్పిన పవన్… ఆ తర్వాత ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. నారా లోకేశ్ ను బలోపేతం చేసేందుకే జనసేన పార్టీ పెట్టారా? అని ప్రశ్నించారు. అమలు చేయడం సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శించారు. ఏపీ శ్రీలంక అయిపోతుందన్న చంద్రబాబు… ఇప్పుడు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారని చెప్పారు.