పార్లమెంట్‌లో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్‌

3 more Opposition MPs suspended from Lok Sabha, total count 146 now

న్యూఢిల్లీః శీతాకాల సమావేశాల్లో విపక్ష ఎంపీలపై సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. కాంగ్రెస్‌ ఎంపీలు దీపక్ బైజ్, నకుల్ నాథ్, డీకే సురేశ్‌లను లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో ఎగువ, దిగువ సభల నుంచి సస్పెండ్‌ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది. ఈ శీతాకాల సెషన్‌ మొత్తానికి వారిని సస్పెండ్‌ చేశారు. పార్లమెంట్‌ చరిత్రలో ఒక సెషన్‌లో ఇంతమందిపై వేటువేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

కాగా, డిసెంబర్‌ 13న లోక్‌సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటన పార్లమెంట్‌ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలని ఉభయసభల్లో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. అయితే ఆందోళన చేపడుతున్న విపక్ష ఎంపీలపై కేంద్ర ప్రభుత్వం సస్పెన్షన్‌ కొరడా ఝళిపిస్తున్నది. వరుసగా ఎంపీలను పార్లమెంట్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నది. ఈ క్రమంలో ఎగువ, దిగువ సభల నుంచి ఇప్పటి వరకూ మొత్తం 146 (తాజా సస్పెన్షన్‌తో కలిపి) మంది ఎంపీలను సస్పెండ్‌ చేసింది.

ఈ నెల 14న 14 మంది ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు. సోమవారం మరో 78 మంది, మంగళవారం 49 మంది, బుధవారం ఇద్దరు ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇవాళ ముగ్గురు ఎంపీలు స్పెండ్‌ అయ్యారు.