జలసౌధలో ముగిసిన గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం

జలసౌధలో బోర్డు చైర్మన్ ఎంకే సింగ్ నేతృత్వంలో గోదావరి నది యాజమాన్య బోర్డు 14వ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ స్పీషల్ సీఎస్ రజత్ కుమార్, ఏపీ ఇఎన్సీ నారాయణ రెడ్డి, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. గోదావరి నది పై గూడెం, మోదీకుంట ప్రాజెక్టుల డిపిఆర్ లు, సీడ్ మని, టెలీమెట్రి, బోర్డ్ ఉద్యోగులు తదితర అంశాలపై చర్చ జరిగింది.

సమావేశం అనంతరం ఏపీ ఈఎన్ సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గోదావరిలో నీటి లభ్యత, రాష్ట్రాల వాటా తేల్చాలని అడిగామని వెల్లడించారు. నీటి లభ్యతపై కేంద్ర జలసంఘంతో శాస్త్రీయ అధ్యయనం చేయించాలని బోర్డు నిర్ణయించినట్టు తెలిపారు. ఇక, తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు ఉన్నా పట్టించుకోవడంలేదని అన్నారు. నీటి లభ్యత ఉండగా గూడెంలో అదనపు ఎత్తిపోతల పథకం ఎందుకని అడిగామని ఈఎన్ సీ నారాయణరెడ్డి వెల్లడించారు. గూడెం ఎత్తిపోతలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పామని తెలిపారు.

టెలీమెట్రీ ఐదు చోట్లే ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరిందని అన్నారు. అయితే టెలీమెట్రీ ఎక్కువచోట్లే ఏర్పాటు చేయాలని తాము కోరామని వివరించారు. పోలవరంపై చర్చకు గోదావరి బోర్డు సరైన వేదిక కాదని చెప్పామని ఆయన వెల్లడించారు. పోలవరంపై తెలంగాణ అభ్యంతరాలను ఇప్పటికే చర్చించామని తెలిపారు. పోలవరంపై తెలంగాణ అభ్యంతరాలు, సమస్యలు పరిష్కారం అయినట్టేనని పేర్కొన్నారు.