చంద్రబాబు ఏజెంట్ లా పవన్ వ్యవహరిస్తున్నారుః సజ్జల

జగన్ నిర్ణయాలు.. చంద్రబాబు రాజకీయాలకు ఉరితాడు లాంటివని వ్యాఖ్య

sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy

అమరావతిః ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు తోడేళ్ల మందలా ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. సంపన్న కులాలకు దీటుగా నిలబడేలా పేదలకు పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీల్లో 98.2 శాతం అమలు చేసిన ధీశాలి జగన్ అని అన్నారు. జగన్ తీసుకునే రాజకీయ నిర్ణయాలు.. చంద్రబాబు రాజకీయాలకు ఉరితాడు లాంటివని అన్నారు.

‘‘అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసం. హౌస్ రెంట్ అలవెన్స్ ను చంద్రబాబు తీసుకుంటున్నారు. లింగమనేని రమేశ్ తన గెస్ట్ హౌస్ ను ప్రభుత్వానికి రాసి ఇచ్చానవి చెబుతున్నారు. అది ప్రభుత్వ గెస్ట్ హౌస్ అయితే చంద్రబాబు నివాసం ఉండేందుకు ప్రభుత్వ అనుమతి ఎందుకు తీసుకోలేదు?’’ అని నిలదీశారు. చంద్రబాబు చెప్తే పవన్ కల్యాణ్ ఏ పాత్ర అయినా పోషిస్తున్నారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు ఏజెంట్ లా పవన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చివరకు కమ్యూనిస్టులు కూడా చంద్రబాబుకు సపోర్టు చేస్తున్నారని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కలిసి అడ్డుకుంటున్నారని సజ్జల మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ దందా చేసేవారు దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్లారని ఆరోపించారు.