జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..డీసీఎం చక్రాల కింద పడి కుటుంబం నుజ్జునుజ్జయింది

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం చక్రాలు ఓ కుటుంబాన్ని మింగేసింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృత్యువాతపడగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలను కోల్పోయారు. వెల్గటూరు మండలం పాశిగామ శివారులో గురువారం సాయంత్రం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

వెల్గటూరు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కోడిపుంజుల తిరుపతి(40)కి భార్య మనోజ, కొడుకులు ఆదిత్య, కన్నయ్యతో పాటు కూతురు చిట్టీ సంతానం. మనోజ అత్త ఇటీవల చనిపోవడంతో మూడునెలల కార్యక్రమానికి హాజరయ్యేందుకు కుటుంబంతో కలిసి బైక్‌పై ధర్మపురి మండలం దొంతపూర్ వెళ్లారు.

కార్యక్రమం అనంతరం తిరిగి ప్రయాణంలో భార్య, పిల్లలతో కలిసి తిరిగి కొత్తపేట వస్తుండగా.. పాశిగామ శివారులో వెనుక నుంచి వచ్చిన డీసీఎం వ్యాన్‌ వారి బైక్‌ను ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో వాహనంపై ఉన్న వారంతా ఎగిరిపడ్డారు. వారిపై నుంచి వాహనం దూసుకెళ్లడంతో శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. తీవ్ర గాయాలతో చిట్టీ, కన్నయ్య అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. తిరుపతిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. భార్య మనోజ, కుమారుడు ఆదిత్యకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.