ఈ విజయాలన్ని సిఎం జగన్‌ వల్లే ..పెద్దిరెడ్డి

అమరావతి: ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా వైఎస్‌ఆర్‌సిపి విజయాలు లభించడం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయాలన్నీ సిఎం జగన్ వల్లే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. 14 ఏళ్ల పాటు సిఎంగా పనిచేసిన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైఎస్‌ఆర్‌సిపి బలపర్చిన వాళ్లే గెలిచారని, అందుకు కారణం కుప్పంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేనని స్పష్టం చేశారు.

మూడో విడత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి మద్దతుదారులు 2,574 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంటే, టిడిపి కేవలం 13 శాతం విజయాలకే పరిమితమైందని అన్నారు. కానీ చంద్రబాబు 36 శాతం గెలిచినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ పతనం ప్రారంభమైందని చెప్పుకుంటున్నారని విమర్శించారు. టిడిపి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తమ పక్షానే నిలిచారని, కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

కుప్పంలో 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 79 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సిపి మద్దతుదారులే నెగ్గారని వెల్లడించారు. ఏకగ్రీవాల్లోనూ తమదే హవా అని, టిడిపికి 15.8 పంచాయతీలు ఏకగ్రీవం అయితే, తమకు 85.81 శాతం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని వివరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/