టిడిపిలో చేరనున్న వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్ జోక్యంపై అసంతృప్తి
అమరావతిః మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 8 తరువాత ఆయన పార్టీ మారే అవకాశం ఉంది. సిద్ధం సభకు తాను హాజరుకాబోనని కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్ జోక్యం చేసుకుంటున్నారంటూ వసంత కృష్ణ ప్రసాద్ గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సీఎం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.
మరోవైపు, వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే రెండు సార్లు నారా లోకేశ్తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సిపి శుక్రవారం జడ్పీటీసీ తిరుపతి రావు యాదవ్ను ఇంచార్జ్గా ప్రకటించింది. ఇదిలా ఉంటే, నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. పనులు చేసిన పార్టీ నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.