టిడిపి-జనసేన సీట్ల పంపకంపై వైఎస్ఆర్సిపి నేతల స్పందన
అమరావతిః టిడిపి-జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో, వైఎస్ఆర్సిపి నేతలు విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. జనసేనకు 24 సీట్లేనా…? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేశారు… ఛీ అంటూ పవన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
అటు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా టిడిపి-జనసేన సీట్ల పంపకంపై స్పందించారు. జనసేనకు అభ్యర్థులే దొరకడంలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మరోసారి వంగవీటి రాధాను మోసం చేశారని విమర్శించారు. బిజెపితో పొత్తుపై చంద్రబాబు, పవన్ చెరొక మాట మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు స్పందిస్తూ… చంద్రబాబు చేతిలో పవన్ కీలు బొమ్మగా మారారని, కాపులకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.