పార్టీల ఆదాయ, వ్యయ వివరాల నివేదిక వెల్లడించిన ఏడీఆర్

ఖర్చులో టీడీపీ అగ్రస్థానం.. మిగులులో వైస్సార్సీపీ ప్రథమం

అమరావతి : పార్టీలకు వచ్చిన విరాళాలను ఖర్చు చేయకుండా అట్టే పెట్టుకున్న పార్టీల్లో వైస్సార్సీపీ దేశంలో మొదటి స్థానంలో నిలవగా.. వచ్చిన ఆదాయం కంటే 1,584.16% ఎక్కువగా ఖర్చు చేసి టీడీపీ తొలి స్థానాన్ని ఆక్రమించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయవ్యయ లెక్కల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వైస్సార్సీపీ కు రూ.107.89 కోట్ల విరాళాలు రాగా, ఆ పార్టీ కేవలం రూ.80 లక్షలే ఖర్చు చేసింది. ఇదే సంవత్సరం టీడీపీ రూ.3.25 కోట్ల విరాళాలు రాగా రూ.54.76 కోట్లు వెచ్చించింది. టీఆర్ఎస్ కు రూ.37.65 కోట్ల ఆదాయం రాగా రూ.22.34 కోట్లు వెచ్చించింది.

2020-21లో మొత్తం 31 ప్రాంతీయ పార్టీలకు రూ.529.41 కోట్ల ఆదాయం వచ్చింది. 2019-20లో వచ్చిన రూ.800.26 కోట్లతో పోల్చితే ఇది 34.96% తక్కువ.ఇందులో రూ.149.95 కోట్లతో డీఎంకే తొలి స్థానంలో నిలిచింది. (రూ.107.99 కోట్లు), బీజేడీ (రూ.73.34 కోట్లు), జేడీయూ (రూ.65.31 కోట్లు), టీఆర్ఎస్ (రూ.37.65 కోట్లు) వరుస స్థానాల్లో నిలిచాయి. టీడీపీ 11వ స్థానానికి పరిమితమైంది.అధిక మొత్తాన్ని మిగుల్చుకున్న పార్టీల్లో వైస్సార్సీపీ (99.25%) తర్వాత బీజేడీ (90.44%), ఎంఐఎం (88.02%) ఉన్నాయి.31 పార్టీలకు రూ.376.86 కోట్లు (71%) స్వచ్ఛంద విరాళాల రూపంలో సమకూరాయి. ఇందులో రూ.250.60 కోట్లను పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో కూడగట్టుకున్నాయి. ఈ బాండ్ల మొత్తం కేవలం 5పార్టీలకే వెళ్లింది. ఇందులో వైస్సార్సీపీ (రూ.96.25 కోట్లు), డీఎంకే (రూ.80 కోట్లు), బీజేడీ (రూ.67 కోట్లు), ఆప్‌ (రూ.5.95 కోట్లు), జేడీయూ (రూ.1.40 కోట్లు) దక్కాయి. 31 పార్టీలకు వడ్డీ రూపంలో రూ.84.64 కోట్ల ఆదాయం వచ్చింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/