కేంద్రానికి వైస్ షర్మిల లేఖ..

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు.. అందులో జరిగిన అవినీతి గురించి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి వైస్ షర్మిల లేఖ రాసారు. రాష్ట్రం మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంఫై ఈమె విమర్శించారు. అందుకే వీలైనంత తొందరలో ఈ విషయంపై విచారణకు ఆదేశించాలని మోడీని లేఖ ద్వారా షర్మిల కోరారు .

ఈ మేరకు షర్మిల ట్విట్టర్ వేదికగా తెలిపారు. ”కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు మరియు అవినీతిపై జోక్యం చేసుకుని వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీ నరేంద్ర మోదీగారికి గట్టి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు అవినీతి, అక్రమాలు మరియు రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఆరోపణలు, ఇవన్నీ బహిర్గతం అయినప్పటికీ, మరియు ప్రాజెక్ట్ వైఫల్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ మొత్తం ఆందోళన చేస్తున్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలలకు ఆదేశించకుండా మౌనముద్ర ధరించడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం, అలాగే తెలంగాణ సమాజం యావత్తు ఆవేదన చెందుతోంది. దేశాన్ని 1.20 లక్షల కోట్ల రూపాయలకు మోసం చేసి, తన జేబులు నింపుకోవడానికి మరియు తన కుటుంబ నికర సంపదను పెంచుకోవడానికి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును తుప్పుపట్టించి, పనికిమాలినదిగా చేసిన ఈ తీవ్ర పరిస్థితుల్లో, ఈ జాతీయ విపత్తుపై కనీసం ఇప్పటికైనా స్పందించి చర్యలకు, విచారణకు ఆదేశించాల్సిందిగా ప్రధాన మంత్రికి మనవి చేసాము. మేము చాలా కాలంగా ప్రాజెక్ట్ సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేస్తున్నాము. ఈ ప్రాతినిధ్యం కేవలం వైయస్ఆర్టీపి మాటగా మాత్రమే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతు మరియు బాధ రంగరించి రాస్తున్న లేఖ” అని రాసుకొచ్చారు.