టిడిపి కండువా కప్పుకున్న వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

YCP MLA Vasantha Krishna Prasad joined TDP

అమరావతిః మైలవరం వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టిడిపిలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ చేరుకున్నారు. కృష్ణప్రసాద్ కు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు… టిడిపిలోకి సాదరంగా ఆహ్వానించారు.

మరోవైపు, ఇటీవల కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపిపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్ కే చెల్లిందని అన్నారు. ప్రతిపక్ష నేతలను తిడితేనే వైఎస్‌ఆర్‌సిపిలో పదవులు ఇస్తారని చెప్పారు. తనకు మైలవరం టికెట్ ఇస్తామని చెపుతూనే చంద్రబాబును, లోకేశ్ ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపిలో ఉండలేకే టిడిపిలో చేరుతున్నానని చెప్పారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని… ఇద్దరం కలిసి కూర్చొని అన్నీ మాట్లాడుకుంటామని తెలిపారు. మరోవైపు, మైలవరం ఎమ్మెల్యే టికెట్ ను దేవినేని ఉమకు కాకుండా వసంత కృష్ణప్రసాద్ కు చంద్రబాబు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.