అమిత్ షా కామెంట్స్ ఫై కేటీఆర్ విమర్శలు

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భాంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యల ఫై టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

74 ఏండ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఇండియ‌న్ యూనియ‌న్‌లో క‌లిపేందుకు వ‌చ్చారు. కానీ ఇవాళ‌నేమో ప్ర‌స్తుత కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని విభ‌జ‌న చేసేందుకు హైద‌రాబాద్‌కు వ‌చ్చార‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. దేశానికి కావాల్సింది విభ‌జ‌న రాజ‌కీయాలు కాదు.. నిర్ణ‌యాత్మ‌క రాజ‌కీయాలు కావాల‌ని తాను ప‌దే ప‌దే చెప్తున్నాన‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

అంతకు ముందు అమిత్ షా ఏమాట్లాడారంటే.. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ చర్యతోనే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. నిజాంసేన, రజాకార్లను తరిమికొట్టి హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని గుర్తు చేశారు. పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలోతో నిజాం తలవంచారని..13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని ఈ సందర్బంగా అమిత్ షా అన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుందనే..వివిధ పేర్లతో కొందరు విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. గతంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని చురకలంటించారు. కానీ కేంద్రం ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్‌ 17న స్వాంతంత్ర్యం వచ్చిందన్నారు.