బిజెపితో కలిసి రైతులకు అండగా నిలబడతాం
అమరావతి కోసం రైతుల చేస్తోన్న పోరాటానికి మద్దతు

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి రాజధాని రైతుల నిరసనపై స్పందించారు. గతంలో ఏపి రాజధానిగా అమరావతిని నిర్ణయించారు కాబట్టి రైతాంగం తమ 34 వేల ఎకరాల పంట భూములను త్యాగం చేశారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ పాలన వచ్చింది కాబట్టి రాజధానిని మార్చుకుంటామని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం రైతాంగాన్ని అవమానించడమేనని తమ పార్టీ మొదటి నుంచి చెబుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజధానిని పరిరక్షించుకునేందుకు రైతులు 200 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. బిజెపితో కలిసి రైతులకు అండగా నిలబడతామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 29 వేల మంది రైతుల త్యాగాలను వృథా కానివ్వబోమని చెప్పారు. రాజధానిని మూడు ముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అయినట్లు కాబోదని చెప్పుకొచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/