బీసీలను చంద్రబాబు మోసం చేశారుః రజని

బీసీల కోసం వైఎస్‌ఆర్‌సిపి రూ. 1.63 లక్షల కోట్లను ఖర్చు చేసిందని వ్యాఖ్య

vidadala-rajini

అమరావతిః ఏపీ మంత్రి విడదల రజని మరోసారి టిడిపి అధినేత చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు. బీసీలను చంద్రబాబు మోసం చేశారని ఆమె అన్నారు. బీసీల సంక్షేమం కోసం గత టిడిపి ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ. 19 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో బీసీలకు రూ. 1.63 లక్షల కోట్లను ఖర్చు చేసిందని తెలిపారు.

బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే భావించారని.. వారిని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేశారని చెప్పారు. బీసీల సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వమని… వారి ఉన్నతి కోసం ఎన్నో సంక్షేమ ఫలితాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రతిదానికీ ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

మంగళగిరిలో త్వరలోనే ఎయిమ్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయని రజని చెప్పారు. దీనివల్ల బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందించే వీలు కలుగుతుందని చెప్పారు. ఎయిమ్స్ కు నీటి సమస్య లేదని… విజయవాడ మున్సిపల్ కమిషనర్, తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి మూడు లక్షల లీటర్ల చొప్పున సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/