టిఆర్ఎస్ను ఓడిస్తే హామీలు అమలవుతాయి..ఉత్తమ్
తెలంగాణకు బిజెపి తీరని అన్యాయం చేస్తోందని మండిపాటు
హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములు నాయక్లకు నిన్న గాంధీభవన్లో ఆ పార్టీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి బీఫారాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్, బిజెపిలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయ రంగంలో పీహెచ్డీ చేసిన చిన్నారెడ్డి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాములు నాయక్లను గెలిపించాలని కోరారు. టిఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ఆ పార్టీని ఓడించడమే ఏకైక మార్గమన్నారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావడంలో బిజెపి ఘోరంగా విఫలమైందని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణకు బిజెపి తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. కాబట్టి ఆ రెండు పార్టీలను ఓడించాలని పట్టభద్రులను ఉత్తమ్ కోరారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/