తెలంగాణ లో అకాల వర్షాలు.. 13 మంది మృతి

ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో ఈదురుగాలులు, ఆకాల వర్షాల ధాటికి వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది మరణించారు. ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు చనిపోగా, హైదరాబాద్లో నలుగురు, మెదక్లో ఇద్దరు మరణించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నాగర్‌ కర్నూల్‌ జిల్లా తాడూరు శివారులో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో వ్యవసాయ పొలంలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కిందకు అక్కడే పని చేస్తున్న తొమ్మిది మంది వెళ్లారు. గాలి బలంగా వీయడంతో షెడ్డుపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోయింది. దీంతో గోడ పక్కనే ఉన్న యజమాని మల్లేశ్‌, అతని పదేళ్ల కుమార్తె సహా అక్కడ పని చేసే మరో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలు కాగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు తెలకపల్లి మండలం కేంద్రంలో లింగాల రోడ్డులో పిడుగుపాటుకు గురై 13 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు బిజినెపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో కూడా పిడుగుపాటుకు మరో వ్యక్తి చనిపోయారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో మంతటి చౌరస్తాలో కారులో కూర్చున్న వేణుగోపాల్‌పై పక్కనే ఉన్న రేకుల షెడ్డు కూలి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలో గాలి దుమారంతో కూడిన వర్షాల కారణంగా రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగిపోయాయి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలోని కీసర నుంచి షామీర్‌ పేట వైపు వెళ్లే రోడ్డు పక్కన ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. వారిపై చెట్టు పడింది. దీంతో వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి.