నేడు రేవ్ పార్టీ కేసు నిందితుల విచారణ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమతో సహా 8 మందిని సీబీఐ నేడు విచారించనుంది. ఈనెల 27న విచారణకు రావాలంటూ వారికి సీబీఐ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టై, జుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు నేడు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 103 మంది పాల్గొనగా అందులో 86 మంది డ్రగ్స్ వినియోగించినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితులయిన ఆరుగురు నిందితులలో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరుగురు నిందితుల్లో ఐదుగురు బ్యాంక్ ఖాతాలను స్థంభింప చేశారు. విజయవాడకు చెందిన వాసు బ్యాంక్ ఖాతాలో పెద్దమొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈరోజు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటీషన్ వేయనున్నారు.

ఈ కేసులో ఆధారాలతో తీగ లాగితే.. డొంక కదులుతోంది. రేవ్ పార్టీలో పొలిటికల్ లీడర్లు.. ప్రముఖులకు లింకులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఏపీ మంత్రి కాకాని పేరుతో ఉణ్న స్టిక్కర్ ఉన్న కారు ఉండటంతో.. మంత్రి అనుచరుడు పూర్ణారెడ్డి బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రేవ్ పార్టీ ఏర్పాటులో ఆ‍యన ప్రముఖ పాత్ర పోషించారని.. పోలీసులు ధృవీకరించారు. కాగా రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా, 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.