నేడే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల MLC ఉప ఎన్నిక నేడు జరగనుంది. 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4.63 లక్షలమంది గ్రాడ్యుయేట్లు ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, BRS నుంచి రాకేశ్ రెడ్డి, BJP అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోపాటు లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన కొన్ని రోజులకే ఉప ఎన్నిక జరుగుతుండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎత్తులు-పైఎత్తులు, వ్యూహ-ప్రతివ్యూహాలని ప్రదర్శించాయి.

ఈనెల 2న నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్, 9 వరకు నామినేషన్లు స్వీకరించింది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్​ఎస్​ అభ్యర్థి రాకేశ్​ రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ సహా 52 మంది పోటీలో ఉన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4 లక్షల 63వేల 839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 2 లక్షల 88 వేల 189 మంది పురుషులు కాగా లక్షా 75 వేల 645 మంది మహిళలున్నారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఇక లోక్‌సభ ఫలితాలు వెల్లడైన మరుసటిరోజు అంటే జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.