పాక్ భారత్‌ను రెచ్చగొడితే..మోడీ ప్రభుత్వం సైన్యాన్ని దింపొచ్చుః అమెరికా నివేదిక

భారత్-చైనా చర్చలు జరుగుతున్నా పరిస్థితి పూర్తిగా సద్దుమణగలేదని వెల్లడి

Under PM Modi, India more likely to use military force on Pak provocation: US report

న్యూఢిల్లీః భారత్‌-పాకిస్థాన్‌, భారత్‌-చైనాకు ఉన్న విభేదాలు ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా.. పాక్ భారత్‌ను రెచ్చగొడితే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం సైన్యాన్ని కూడా రంగంలోకి దింపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ పరిస్థితులపై అమెరికా ఇంటెలిజెన్స్ కాంగ్రెస్‌కు (అమెరికా పార్లమెంట్) ఓ నివేదిక సమర్పించింది. అంతర్జాతీయ భద్రతాంశాలపై నేషనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయం ఏటా అమెరికా పార్లమెంటుకు ఓ నివేదిక సమర్పిస్తుంది.

సరిహద్దు వివాదంపై ఇండియా, చైనా మద్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా సద్దుమణగలేదని అమెరికా ఇంటెలిజెన్స్ శాఖ పేర్కొంది. 2020 నాటి గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కొంత మేర ఉద్రిక్త వాతావరణం నెలకొందని తమ నివేదికలో తెలిపింది. సరిహద్దు వద్ద ఇరు దేశాల సైన్యాల మోహరింపుతో ఘర్షణకు అవకాశాలు పెరిగాయని, ఇది అమెరికా ప్రయోజనాలకు ప్రమాదమని అభిప్రాయపడింది. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలని కూడా సూచించింది.

ఇక భారత్-పాక్ సంబంధాలపై అమెరికా వర్గాలు మరింత ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరు దేశాల మధ్య పరిస్థితి దిగజారే అవకాశాలు ఎక్కువని అభిప్రాయపడ్డాయి. ఇరు దేశాలు సరిహద్దు వెంబడి శాంతి స్థాపనకు మొగ్గు చూపుతున్నప్పటికీ.. పాక్ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న కారణంగా మోడీ నేతృత్వంలోని భారత్ దాయాదిపై సైనిక శక్తిని వినియోగించే అవకాశాలు పెరిగాయని పేర్కొంది.