మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు..త్రిపురలో ఆధిక్యం దిశగా బిజెపి

నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్

tripura-meghalaya-nagaland-assembly-polls-results-and-live-updates

న్యూఢిల్లీః ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌‌ లలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. త్రిపురలో 60, మేఘాలయలో 60, నాగాలాండ్‌లో 60 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. త్రిపుర, నాగాలాండ్‌ లలో బిజెపి కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మేఘాలయలో మాత్రం కన్రాడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పేర్కొన్నాయి.

కాగా, త్రిపురలో బిజెపి క్లీన్ స్వీప్ ఖాయంగా కనిపిస్తోంది. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఈ మూడు రాష్ట్రాల్లో చెరో 60 సీట్ల చొప్పున మొత్తం 180 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం త్రిపురలో 30 స్థానాల్లో బిజెపి ముందంజలో ఉంది. వామపక్షాలు 15, టీఎంసీ 13, ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక్కడ మ్యాజిక్ మార్క్ 31 మాత్రమే. ఇక, మేఘాలయలో కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధికారం దిశగా అడుగులేస్తోంది. ఆ పార్టీ 21 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుండగా, కాంగ్రెస్ ఆరు, బిజెపి 5, ఇతరులు 27 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ- బిజెపి కూటమి ముందంజలో ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 37 స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉండగా, ఓ స్థానంలో విజయం సాధించింది. ఎన్‌పీఎఫ్ 3, కాంగ్రెస్ 2, ఇతరులు 18 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. త్రిపుర, నాగాలాండ్‌‌లలో బిజెపి కూటమి అధికారంలోకి వస్తుందని, మేఘాలయలో మాత్రం నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇప్పుడీ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.