అవుటర్ రింగ్‌రోడ్డుపై బోల్తా పడిన థమ్స్అప్ లోడ్ లారీ

క్షణాల్లోనే లారీ సరుకును మాయం చేసిన వాహనదారులు

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట వద్ద లారీ బోల్తా పడింది. రింగురోడ్డుపై థమ్స్‌అప్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అదే మార్గంలో ప్రయాణిస్తున్న వారు అక్కడ ఆగి థమ్స్అప్ సీసాలను ఎత్తుకెళ్లేందుకు పోటీపడ్డారు. థమ్స్‌అప్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న లారీ నిన్న రాత్రి దాదాపు 8 గంటల సమయంలో ఓఆర్ఆర్‌పై వెళ్తూ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో థమ్స్అప్ బాటిల్స్ అన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు.

మరోవైపు, ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు తమ వాహనాలను ఆపి రోడ్డుపై పడిన థమ్స్అప్ బాటిల్స్‌ను ఎత్తుకెళ్లారు. గాయాలతో మూలుగుతున్న డ్రైవర్, క్లీనర్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా క్షణాల్లోనే లారీలోని సరుకు మొత్తాన్ని ఖాళీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/