తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై బుధువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి వీఐపీ విరామ సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా బాగుండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని ముందు అందరూ సమానమే అంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఆనందదాయకమని కొనియాడారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆహ్వనం లేకపోవడంతోనే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ,సచివాలయం ప్రారంభోత్సవాలకు హజరు కాలేదని చెప్పారు. ఆహ్వనించామని వారు పేర్కోనడంతోనే తాను ఆహ్వనం అందలేదని చెప్పాల్సి వచ్చిందన్నారు. ఆహ్వనం పంపలేదని తాను ఎవరిని అడగలేదని గవర్నర్ చెప్పుకొచ్చారు.