వైనాట్ 175 అని జగన్ అంటుంటే… వైనాట్ 5 అని ప్రజలు అంటున్నారుః గోరంట్ల

టిడిపి – జనసేన అభ్యర్థులు గెలవడం ఖాయమన్న బుచ్చయ్య చౌదరి

gorantla buchaiah chowdary
gorantla buchaiah chowdary

అమరావతిః టికెట్లు ఎవరికి ఇచ్చినా టిడిపి- జనసేన అభ్యర్థులు గెలవడం ఖాయమని టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారని… ఈ దోపిడీపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకున్న సొమ్మును కక్కిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై విమర్శలు గుప్పించారు. రామచంద్రాపురంలో పనికిరాని చెల్లుబోయిన రాజమండ్రి రూరల్ లో పోటీకి పనికొస్తాడా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని… పార్టీ నాయకత్వం ఎక్కడ నుంచి టికెట్ ఇచ్చినా పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ సిట్టింగులకే టికెట్ అని తమ హైకమాండ్ ఎప్పుడో చెప్పిందని తెలిపారు.

వైనాట్ 175 అని జగన్ అంటుంటే… వైనాట్ 5 అని ప్రజలు అంటున్నారని బుచ్చయ్య చౌదరి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్ తన పేరు పెట్టుకుంటున్నారని… రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారని విమర్శించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయని చెప్పారు. పోలీసులు, టీచర్ల నియామకాలు చేపట్టలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఆదేశాల మేరకు రాజమండ్రి రూరల్ లేదా రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని స్థానాలను స్వీప్ చేస్తామని చెప్పారు.