మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త కన్నుమూత
గుండెపోటుతో దేవీసింగ్ షెకావత్ కన్నుమూత
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/02/Ex-President-Pratibha-Patils-husband-Devisingh-Shekhawat-dies-of-heart-attack-jpg.webp)
న్యూఢిల్లీః భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త దేవీసింగ్ హెకావత్ కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను ఫూణెలోని కేఈఎం ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు పూణెలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
దేవీసింగ్ షెకావత్ ఎమ్మెల్యేగా కూడా చేశారు. అమరావతి నియోజకవర్గం నుంచి 1985లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గొప్ప విద్యావేత్త కూడా. 1972లో ముంబై యూనివర్శిటీ నుంచి ఆయన పీహెచ్డీ చేశారు. అమరావతి తొలి మేయర్ గా కూడా ఆయన పని చేశారు. భారతదేశ తొలి జెంటిల్మన్ (మహిళా రాష్ట్రపతి భర్త)గా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.