ఉద్ధవ్ థాక్రేను సీఎంగా పునరుద్ధరించలేం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీః మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. పార్టీకి థాక్రే రాజీనామా చేశారని, అందుకే ఆయన్ను తిరిగి ప్రభుత్వానికి నియమించలేమని కోర్టు తెలిపింది. అసెంబ్లీలో బలపరీక్షకు హాజరుకాకుండానే థాక్రే తన పదవికి రాజీనామా చేశారని కోర్టు వెల్లడించింది. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండేనే సీఎంగా కొనసాగుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో శివసేన పార్టీలో చెలరేగిన కుమ్ములాటకు సుప్రీం తాజా తీర్పుతో థాక్రే వర్గానికి జలక్ ఇచ్చింది.
గత ఏడాది జూన్లో మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఎమ్మెల్యేల మెజారిటీని థాక్రే కోల్పోయారని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన ప్రకటనను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఉద్ధవ్ తరపు సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మనూ సింఘ్వీలు వాదించారు. షిండే వర్గం తరపున హరీశ్ సాల్వే, నీరజ్ కౌల్, మహేశ్ జఠ్మలానీలు వాదించారు. శివసేన పార్టీ, గుర్తు విషయంలో ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. షిండే వర్గానికి చెందిన శివసేన పార్టీకి ధనస్సు సింబల్ను కేటాయించారు. ఇక థాక్రే వర్గానికి శివసేన ఉద్దవ్ థాక్రే పేరుతో పాటు టార్చ్ సింబల్ను కేటాయించారు