రాష్ట్రంలో నేటి నుండి ఉచిత బూస్టర్​ డోస్

Corona Vaccination -File
free-booster-dose-from-today-in-telangana

హైదరాబాద్‌ః నేటి నుంచి రాష్ట్రంలో కొవిడ్​ బూస్టర్​ డోస్ అందుబాటులోకి రానుంది.​ ప్రభుత్వ దవాఖానాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కొవిడ్ వాక్సిన్ బూస్టర్ డోసు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బూస్టర్ డోస్​కి సంబంధించి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి మంత్రి హరీశ్​ రావు మూడు సార్లు లేఖ రాయగా.. ఎట్టకేలకు ప్రభుత్వ చొరవ ఫలించినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. 18 ఏళ్లుపై బడి అర్హులైన ప్రతి ఒక్కరికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై మంత్రి హరీశ్​రావు హర్షం వ్యక్తం చేశారు. రెండో డోసు తీసుకుని 6 నెలలు పూర్తయిన వారికి ప్రభుత్వ ద‌వాఖానాల్లో ఉచితంగా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తెలిపారు. 75 రోజుల పాటు జ‌రిగే ఈ వ్యాక్సినేష‌న్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారంద‌రికి బూస్టర్ డోస్ ఇచ్చేలా.. త‌ద్వారా క‌రోనా నుంచి కాపాడుకునేందుకు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకునేలా ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంటున్నామన్నారు.ఇప్పటి వ‌ర‌కు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించిన కేంద్రం..

ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి.. 18 ఏళ్లు పైబ‌డిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేవ‌లం ప్రైవేటు అసుప‌త్రుల‌కు అనుమ‌తించింది. ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో ఉచితంగా బూస్టర్ డోస్ అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది ల‌బ్ధి పొంద‌లేక‌పోయారు. మ‌రోవైపు కొత్త వేరియంట్ రూపంలో క‌రోనా కేసులు ప‌లు రాష్ట్రాల్లో పెర‌గ‌టం ప్రారంభ‌మైంది. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞ‌ప్తులు చేసిందని… రెండు డోసులు పూర్తి చేసుకున్న అర్హుల‌కు ఉచితంగా బూస్ట‌ర్ డోస్‌ ఇచ్చేందుకు వీలుగా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో బూస్ట‌ర్ డోస్ పంపిణీకి అనుమ‌తించాల‌ని కోరినట్టు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ కలిపి మొత్తం 20 లక్షల డోసుల నిల్వ ఉందిని పేర్కొన్న మంత్రి… అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి బూస్ట‌ర్ అందించేలా ఏర్పాట్లు చేయలని వైద్యారోగ్య శాఖ అధికారుల‌ను ఆదేశించామన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/