తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన తెలియజేసింది వాతావరణ శాఖ. తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడే అవకాశముందని స్పష్టం చేసింది. అలాగే సూర్యాపేట, మహబూబాబాద్, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది.

ఇక ఏపీ విషయానికి వస్తే.. విభిన్న వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు ఎండలు, వేడిగాలులు వీస్తుంటే.. అక్కడక్కడా మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. నేడు 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 218 మండలాల్లో వడగాల్పులు.. గురువారం 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 260 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బాపట్ల, గుంటూరు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, యానాం, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో వాతావరణం పొడిగానే ఉంటుంది.