తెలంగాణ లో మూడోరోజు కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ లో మూడో రోజు కొనసాగుతుంది. మూడో రోజు రాహుల్ తన పాదయాత్రను మరికల్ మండలం యలిగండ్ల నుంచి ప్రారంభించారు. మరికల్, దేవరకద్ర మీదుగా మన్యంకొండ వరకు యాత్ర కొనసాగనుంది. మొత్తం 23.3 కిలో మీటర్ల పాదయాత్ర కొనసాగనుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాత్రికి మహబూబ్ నగర్ లో యాత్ర నిలిచిపోతుందని తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, గోప్లపూర్ కలాన్ లో విరామం తీసుకున్న అనంతరం మళ్లీ సాయంత్రం పాదయాత్ర కొనసాగిస్తారు. మన్యంకొండ దేవాలయం ప్రాంతంలో జరిగే సమావేశంలో రాహుల్ పాల్గొననున్నారు. ఇక ఈ యాత్రలో కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ నేత కేసీ వేణు గోపాల్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అలాగే నవంబర్ 01 న రాహుల్ పాదయాత్ర లో AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పాల్గొననున్నారు.