ఖమ్మంలోనే ఉంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా అంటున్న రేణుకాచౌదరి

మాజీ కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి..బిఆర్ఎస్ పార్టీ ఫై నిప్పులు చెరిగారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కారు పంక్చర్ కావడం ఖాయం అని , కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారని రేణుక చౌదరి అన్నారు. నేడు ఖమ్మంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రేణుక చౌదరి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, బీఆర్ఎస్ లోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు.

ఖమ్మంలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేసారు. గత ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానంలో నాలుగు లక్షలకు పైగా ఓట్లను సాధించామని అన్నారు.

తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పాలేరు నుంచి పర్ణశాల వరకు అభివృద్ధి చేశానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో కాంగ్రెస్ తరపున గెలిచి బిఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్లంతా తిరిగి యూటర్న్ తీసుకుంటారని అన్నారు. కేంద్రంలో, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేణుక ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని అన్నారు. హిందుత్వ ముసుగులో బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని అన్నారు.