తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్నఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. తెలంగాణలో 2, ఏపీలో 13 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 3 లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 5 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.

అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల తో పాటు ఉమ్మడి కర్నూల్, కడప జిల్లాలోనూ పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 41 మంది బరిలో ఉండడంతో జంబో బ్యాలెట్ పేపర్‌తో పాటు జంబో బ్యాలెట్ బాక్స్ లను ప్రత్యేకంగా తెప్పించారు. దాదాపు అన్ని చోట్లా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

తెలంగాణలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోలింగ్ జరుగుతోంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం 29,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. ఎన్నికల అధికారులు 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 126 మెయిన్ పోలింగ్ స్టేషన్లు ఉండగా.. 11 అదనపు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 29,720 ఓటర్లలో పురుషులు 15,472 మంది కాగా.. స్త్రీలు 14,246 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు.