భారతీయులు గర్విస్తున్న క్షణాలివి..RRR కు ఆస్కార్ రావడం పట్ల పవన్ స్పందన

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం పట్ల యావత్ దేశ ప్రజలు గర్వంగా ఫీల్ అవుతున్నారు. సినీ అభిమానులు, ప్రముఖులే కాదు అన్ని రంగాల వారు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతీయులు గర్విస్తున్న క్షణాలివి అని భావోద్వేగానికి గురయ్యారు.

‘‘ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నిలిచిన ‘RRR’లోని ‘నాటు నాటు…’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఈ గీతాన్ని ఆస్కార్‌ వేదికపై ప్రదర్శించడంతో పాటు… అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళికి ప్రత్యేక అభినందనలు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌, నృత్య దర్శకులు ప్రేమ్‌ రక్షిత్‌, నిర్మాత డీవీవీ దానయ్యలకు అభినందనలు’’ అంటూ పవన్ కళ్యాణ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.

అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవడం అభినందనీయం. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’ అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కినందుకు రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రాంచరణ్, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, సినిమాటోగ్రఫర్ ప్రేమ రక్షిత్‌కు అభినందనలు చెబుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ఆస్కార్ అవార్డును దక్కించుకోవడం ద్వారా నాటు నాటు సాంగ్ చరిత్రలో తన స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది బహుశా భారతీయ సినిమాకు అత్యుత్తమ క్షణం. తెలుగువారు దీనిని సాధించడం మరింత ప్రత్యేకమైనది’ అంటూ చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.