నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే చనిపోయారు. ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్ పల్లి శివారులో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. భారీ ట్రక్కును అతివేగంతో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

మృతులను మహారాష్ట్రలోని బిలోలికి ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటన తర్వాత మృతుల కుటుంబాలకు సమాచారం అందించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగం ప్రాణాలనే హరిస్తుందని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెబుతున్నప్పటికీ, మితిమీరిన వేగంతో ప్రతిరోజు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. తమ కుటుంబాలను శోకసంద్రంలో ముంచి వెళ్ళిపోతున్నారు. కనుక వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటే మంచిదని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి, పరిమిత వేగంతో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు చెపుతున్నారు.