నేడు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ ను వీక్షించనున్నఇద్దరు ప్రధానులు

కాసేపు కామెంటరీ చెప్పనున్న మోడీ

pm-modi-will-toss-today-in-ahmedabad-test

న్యూఢిల్లీః బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులను భారత్ సొంతం చేసుకోగా, మూడో మ్యాచ్‌ను పర్యాటక జట్టు గెలుచుకుంది. దీంతో నేటి మ్యాచ్ కీలకంగా మారింది. అంతేకాదు, నేటి మ్యాచ్‌కు ఎంతో ప్రత్యేకత కూడా ఉంది. ఇండో-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఇప్పటికే భారత్ చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ఆయన మ్యాచ్‌ను వీక్షిస్తారు. అలాగే, మోడీ కాసేపు కామెంటరీ కూడా చెబుతారని సమాచారం. మ్యాచ్‌కు ముందు ప్రధానులు ఇద్దరు బంగారు పూత పూసిన గోల్ఫ్ కారులో స్టేడియంలో తిరుగుతారని కూడా తెలుస్తోంది.

కాగా, ఈ టెస్టు భారత్‌కు ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌ను కైవసం చేసుకుంటే భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు నేడు లక్షమంది ప్రేక్షకులు వస్తారని అంచనా. ఇప్పటికే 75 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రధాని రాక నేపథ్యంలో స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తమ అభిమానుల కోసం స్టేడియంలో ప్రత్యేకంగా టికెట్ల విక్రయం చేపట్టినట్టు ‘క్రికెట్ ఆస్ట్రేలియా’ తెలిపింది.