కర్నూలులో దారుణం.. పట్టపగలు అల్లుడిని నరికి చంపిన మామ

కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జాతరకొచ్చిన అల్లుడిని అందరూ చూస్తుండగానే మామ కత్తితో నరికి చంపాడు. దేవనకొండ మండలం పి.కోటకొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అల్లుడిపై కక్ష పెంచుకున్న లింగమయ్య.. జాతరలో పాల్గొన్న అల్లుడిని హత్య చేయాలని భావించాడు. పథకం ప్రకారం కత్తులు సిద్ధం చేసుకుని దాడి చేశాడు. గ్రామంలో జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేశారు.. అయినా హత్య జరగడం కలకలంరేపింది.

గ్రామానికి చెందిన లింగమయ్య, అతడి అల్లుడు సూర్యప్రకాశ్ (23) మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధువారం జాతరకొచ్చిన అల్లుడిపై లింగమయ్య కత్తులతో దాడిచేశాడు. అందరూ చూస్తుండగానే అల్లుడు సూర్యప్రకాశ్‌ను అతి దారుణంగా నరికాడు. ఘటనా స్థలంలోనే కుప్పకూలిన సూర్యప్రకాశ్‌ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సూర్యప్రకాష్‌ది క్రిష్ణగిరి మండలం పోతుగల్లు కాగా.. అతడికి దేవనకొండ మండలం పీ కోటకొండకు చెందిన మైత్రితో ఏడాది క్రితం వివాహం జరిగింది.


ఆమె ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. అయితే సూర్యప్రకాష్‌ మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వివాహేతర సంబంధం కారణంగా కొన్ని నెలలుగా తన కుమార్తెను వేధిస్తున్నాడని తండ్రి కోపం పెంచుకున్నాడు. గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది.. ఈ క్రమంలోనే సూర్యప్రకాష్ మామ ఇంటికి వచ్చాడు. తన భార్యను ఊరికి తీసుకెళ్తానని మామ, కుటుంబ సభ్యులను అడిగాడు. జాతర ఉందని.. అయ్యాక పంపుతామని వారు చెప్పారు. ఈ క్రమంలోనే మాటామాట పెరిగి ఘర్షణ జరిగి ..చివరకు ప్రాణాలు తీసే వరకు వచ్చింది.