‘ఢిల్లీ ఛలో’..తీవ్ర ఉద్రిక్తత.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

‘Delhi-chalo’ protest: Farmers-police clash in Haryana, tear gas used to disperse agitating farmers

న్యూఢిల్లీః తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమంలో భాగంగా పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లోని శంభు బార్డర్‌కు రైతులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ముందుగా పోలీసులు వచ్చినవాళ్లను వచ్చినట్టే అరెస్ట్‌ చేసి స్టేషన్‌లకు తరలించారు. కానీ, కాసేపటికే రైతుల సంఖ్య పెద్ద ఎత్తున పెరగడంతో అరెస్టులు సాధ్యం కాలేదు. వారిని చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. దాంతో ఆందోళనకారులు తలోదిక్కు పరుగులు తీశారు. అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.

రైతుల ‘ఢిల్లీ చలో’ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ఆంక్షలు విధించారు. ఢిల్లీని ఆనుకుని వున్న శాటిలైట్ టౌన్స్‌లో పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. దీంతో ఘజియాపూర్, చిల్లా సరిహద్దుల వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా, ఈ ఉదయం 10 గంటలకు ఢిల్లీ చలో మార్చ్ ప్రారంభమైంది. పంజాబ్‌లోని సంగ్రూర్ నుంచి 2500 ట్రాక్టర్లతో రైతులు హర్యానా మీదుగా ఢిల్లీకి బయలుదేరారు.