నేడు వారణాసిలో నామినేషన్‌ వేయనున్న ప్రధాని మోడీ

PM Modi will make nomination in Varanasi today

న్యూఢిల్లీః ప్రధాని మోడీ యూపీలోని వారణాసి నుంచి రెండు పర్యాయాలు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మూడోసారి విజయంపై గురిపెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్నారు. అత్యంత అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, పార్టీ సినియర్‌ నేతలు, బీజేపీ పాలిత, మిత్రపక్షాల ముఖ్యమంత్రులతోపాటు ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలు హాజరుకానున్నారు. దీంతో ఏర్పాట్లను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

కాగా, వారణాసిలో లోక్‌సభ అభ్యర్థిగా మరోసారి పోటీచేస్తున్న నరేంద్ర మోడీ సోమవారం ఆరు కిలోమీటర్ల మేర ఆ పట్టణంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. విద్యా రంగ సంస్కర్త మదన్‌మోహన్‌ మాలవీయా విగ్రహానికి పూలమాల సమర్పించి తన యాత్రను ఆయన ప్రారంభించారు. రోడ్‌షోలో ఆయన వెంట యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఉన్నారు. ప్రధానమంత్రికి ఆహ్వానం పలుకుతూ, కనీసం వంద చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. కాషాయ దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకు అటు ఇటు పెద్దఎత్తున గుమిగూడి రోడ్‌షోకు స్వాగతం పలికారు. నరేంద్రమోడీపై పూలవర్షం కురిపించారు.

వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి హాజరుకానున్నారు పలువురు ప్రముఖులు. బీజేపీ పాలిత రాష్ట్రాల 12 మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన నేతలు జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ), అనుప్రియ (అప్నాదళ్), ఓంప్రకాశ్ రాజ్‌భర్ (సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ), పవన్ కళ్యాణ్ (జనసేన) చంద్రబాబు(టిడిపి) మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు.