అకాల వర్షాలతో రైతులు దెబ్బతిన్నారు..ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని పవన్ సూచన

గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట నీళ్లపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాలవర్షాల ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్లతో రైతాంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రాథమిక అంచనా ప్రకారం 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఇప్పుడు వడగండ్లతో కూడిన వర్షాలు మరింత కుంగదీస్తున్నాయని ఆయన అన్నారు.

ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మిర్చి రైతులు… ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మామిడి, పొగాకు, మొక్కజొన్న రైతులు… ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల రైతులు… నెల్లూరు జిల్లాలో వరి రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి తక్షణమే ఆర్థికసాయం, పంట నష్టపరిహారాన్ని అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు.