సీఎం జగన్ కు జనసేనాధినేత లేఖ..

ఏపీ సీఎం జగన్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాసారు. రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్ల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పవన్ ఆరోపించారు. ఈ మేరకు సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్లను తగ్గించుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉంది. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారుగా 4 లక్షల మంది లబ్ధిదారులకి నోటీసులు జారీ చేశారు. పేదలైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను ఇప్పటి వరకూ పొందుతున్న పింఛన్లకు దూరం చేయడం కోసమే నోటీసులు ఇచ్చారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

లబ్ధిని తొలగించేందుకు చూపించిన కారణాలు కూడా సహేతుకంగా లేవు. మచ్చుకు కొన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు పింఛన్లు రద్దు నోటీసులు ఇచ్చి – ఒక్కొక్కరి పేరునా వేల ఎకరాల భూములు ఉన్నాయని కారణం చూపారు. అదే నిజమైతే ఆ వృద్ధులకు ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా పెనుకొండ ప్రాంతంలో రజక వృత్తిపై ఆధారపడిన శ్రీమతి రామక్క అనే పింఛనుదారుకి 158 ఇళ్ళు ఉన్నాయని నోటీసులో చూపారు. నిజంగా అన్ని ఇళ్ళు రామక్క గారికి ఉంటే అవి ఎక్కడ ఉన్నాయో చూపించి ఆ ఇళ్ల తాళాలు ఇవ్వండి. మెళియాపుట్టి ప్రాంత వృద్ధులైనా, రజక వృత్తి చేసుకొనే రామక్క గారైనా పేదలే. వారికి తండ్రి నుంచో, తాతల నుంచో వారసత్వంగా వచ్చిన ఎస్టేట్లు, ఇళ్ళు లేవని గ్రహించగలరు. మీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం అంతటి ఆస్తిపరులే అయితే పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూనో, మీ వాలంటీర్ల చుట్టూనో ఎందుకు తిరుగుతారు?

విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో రద్దు చేయాలని చూడటం విచిత్రంగా ఉంది. కొన్ని ఇళ్లకు ఉమ్మడి మీటర్లు ఉంటున్నాయి… అలాగే ఒకే ఇంటి నెంబర్ తో మూడు నాలుగు వాటాలు ఉంటాయి. కాబట్టి వాస్తవిక దృక్పథంతో చూసి పేద వృద్ధులను, వితంతువులను ఆవేదనకు గురి చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

ఈ విధంగా నోటీసులు ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తున్నారు. పాతికేళ్ళ కిందట చనిపోయినవారు ఇప్పటికీ ఆదాయపు పన్ను కడుతున్నారు అని నోటీసుల్లో చూపించి వితంతు పింఛన్లు రద్దు చేస్తామంటున్నారు. ఈ తరహా నోటీసులు సమర్థనీయమేనా? ఈ తరహా నోటీసులు దివ్యాంగులకు సైతం వేదన కలిగిస్తున్నాయి. పదిపదిహేనేళ్ళకు ముందు నుంచీ పింఛన్ తీసుకొంటున్న దివ్యాంగులను, నాడు ఇచ్చిన ధ్రువపత్రాలు ఇప్పుడు చూపించాలని ఒత్తిడి చేయడంలో ఉద్దేశం ఏమిటి? వారి వైకల్యం కళ్లెదురుగా కనిపిస్తున్నా లబ్ధికి దూరం చేస్తామనడం భావ్యమేనా?

మా పార్టీ తరఫున చేపట్టిన ‘జనవాణి’ కార్యక్రమంలో అనేకమంది దివ్యాంగులు – తమకు పింఛన్లు అందటం లేదని, పింఛన్లు రాకుండా రాజకీయ కారణాలతో అడ్డుకొంటున్నారనీ, వైకల్యాన్ని ధృవీకరించే సర్టిఫికెట్ల మంజూరు ఇబ్బందికరంగా మారిందనీ వాపోయారు. పింఛన్ల రద్దు నోటీసులపై వాస్తవ పరిస్థితులను తెలియచేస్తుంటే సరిదిద్దకపోగా.. ‘తిట్టండి‘ అని జిల్లా కలెక్టర్లను ఆదేశించడం ద్వారా ముఖ్యమంత్రిగా మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించాననే భావిస్తున్నారా?

అవ్వా.. తాతా… అంటూ, రూ.3 వేలు పెన్షన్ ఇస్తాను అని మీరు ఇచ్చిన హామీని ఈ విధంగా అమలు చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారు.కాలం గడుస్తున్న కొద్దీ పింఛన్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చూడాలి. అంతేగానీ పెన్షన్ మొత్తం పెంచుతున్నాం కాబట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవాలి అనుకోవడం సరికాదు. మీ పాలనలోని ఆర్థిక దివాళాకోరుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెన్షన్ల తొలగింపు చేపట్టడం ఏమిటి? సామాజిక పింఛన్ అందుకొంటున్న లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరుతున్నాను. పింఛన్లు అందజేయడంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను ” అంటూ లేఖలో పవన్ పేర్కొన్నారు.