కందుకూరు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటన

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించిన మోడీ

pm-modi

న్యూఢిల్లీః నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి అధినేత చంద్రబాబు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. సభకు టిడిపి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటన వల్ల తీవ్రంగా కలత చెందానని మోడీఅన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని… గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు.

కాగా, టిడిపి అధినేత చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లా కందుకూరు విచ్చేశారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కందుకూరులో రోడ్లు క్రిక్కిరిసి పోయాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. విపరీతమైన రద్దీ నెలకొనడంతో కార్యకర్తల మధ్య తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు స్పృహ కోల్పోయారు. ఈ విషయం తెలియడంతో చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/